వాట్సప్‌కి ధీటుగా సర్కారీ వాట్సప్, కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

వాట్సప్‌కు ధీటుగా కేంద్రప్రభుత్వం సర్కారీ వాట్సప్ పేరుతో  సొంతంగా ఓ వేదికను తయారుచేయనుంది. వాట్సప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. సేఫ్ అండ్ సెక్యూర్ అయిన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫారం తీసుకురావాలని పట్టుదలగా ఉంది. తొలుత దీనిని ప్రభుత్వ విభాగాలు సమాచారం పంచుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నారు. 

ప్రభుత్వ వాట్సప్ తీసుకురావాలనే ఆలోచన రావడానికి కారణం  చైనాకు చెందిన హువాయి కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా అలర్ట్ అయింది. ఈ మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ లోభాగంగా సురక్షితమైన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫామ్ రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు హువాయిను బ్యాన్ చేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. 

అమెరికా ఆంక్షల వల్ల ఆ కంపెనీకి, ఫోన్లకు అమెరికా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను ఆపేశాయి. భవిష్యత్ లో ఏ కారణంతో అయినా మన దేశంలో అమెరికా కంపెనీల నెట్‌వర్క్‌లను ఆపేయమని ఆ ప్రభుత్వం ఆదేశించవచ్చని అధికారులు తెలిపారు. అదే జరిగితే మన దేశంలో చాటింగ్‌ ప్లాట్‌ఫారాలన్నీ నిలిచిపోతాయి. ఆ ప్రమాదం రాకుండా చూడటానికే సొంత వాట్సప్‌ను అభివృద్ధి చేయనున్నామని ప్రభుత్వ అధికారులు వివరించారు. సర్కారీ వాట్సప్‌ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జీ-మెయిల్, వాట్సప్‌లను వాడొద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచిస్తామన్నారు.

 ఇదిలా ఉంటే ప్రభుత్వం వాట్సప్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్‌) పట్టుబడుతోంది. దాన్ని అమెరికా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సొంత వాట్సప్‌ రూప కల్పనకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

న్యూస్ టెక్నాలజీ వాట్సప్ వాట్సప్ ఇండియా సర్కారీ వాట్సప్ ఇండియా సోషల్ మీడియా